Home  »  Featured Articles  »  శ్రీదేవి, జయప్రదను ఒకే గదిలో పెట్టి తాళం వేసిన హీరో.. అలా గంటసేపు? 

Updated : Feb 22, 2024

మధ్యతరం హీరోయిన్లలో శ్రీదేవి, జయప్రదలకు ప్రత్యేక స్థానం ఉంది. ఒకరిని మించి ఒకరు తమ అందచందాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేసేవారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు సినిమాలో ఉన్నారంటే చాలు ఆ సినిమాకి జనం క్యూ కట్టేవారు. అంతటి పాపులారిటీ సాధించిన శ్రీదేవి, జయప్రద ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ తమ సత్తా చాటారు. టాలీవుడ్‌లో అయినా, బాలీవుడ్‌లో అయినా ఇద్దరి మధ్యా ఎప్పుడూ పోటీ ఉండేది. అదే సమయంలో ఇద్దరి మధ్య తెలియని ఓ కోల్డ్‌వార్‌ ప్రారంభమైంది. అది ఎప్పుడు ఎలా స్టార్ట్‌ అయ్యిందో తెలీదుగానీ, ఇద్దరికీ మాటల్లేవు. ఎదురు పడినపుడు హలో అంటే హలో అనుకునేవారు. అంతకు మించి ఒక్క మాట కూడా ఇద్దరి నోటి నుంచి వచ్చేది కాదు. వాస్తవానికి ఇద్దరికీ ప్రత్యక్షంగా ఎలాంటి గొడవలు లేవు. అయినా వారి కెరీర్‌ మొత్తాన్ని అలాగే కొనసాగించారు.

శ్రీదేవి, జయప్రదలలో సీనియర్‌ ఎవరంటే శ్రీదేవి అనే చెప్పాలి. ఎందుకంటే నాలుగేళ్ళ వయసు నుంచే ఆమె సినిమాల్లో నటిస్తోంది. 1975లో విడుదలైన ‘అనురాగాలు’ చిత్రంలో శ్రీదేవి మొదటిసారి హీరోయిన్‌గా నటించింది. అయితే అంతకు ఒక సంవత్సరం ముందే ‘భూమికోసం’ చిత్రంతో జయప్రద హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ విధంగా చూస్తే శ్రీదేవి కంటే జయప్రద సీనియర్‌. హీరోయిన్‌గా జయప్రదకే మొదట స్టార్‌డమ్‌ వచ్చింది. 1977లో వచ్చిన ‘అడవిరాముడు’ చిత్రంతో ఒక్కసారిగా  టాప్‌ హీరోయిన్‌ రేంజ్‌కి వెళ్లిపోయింది. శ్రీదేవికి మాత్రం హీరోయిన్‌గా మొదటి సినిమా చేసిన మూడేళ్ళ తర్వాత ‘పదహారేళ్ళ వయసు’ చిత్రంతో బ్రేక్‌ వచ్చింది. అందులో ఆమె గ్లామరస్‌ హీరోయిన్‌గా కనిపించలేదు. అయితే నటిగా ఆమెకు చాలా మంచి పేరు వచ్చింది. ఆ మరుసటి సంవత్సరమే ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన ‘వేటగాడు’ చిత్రంతో శ్రీదేవి గ్లామరస్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఈ ఇద్దరు హీరోయిన్లకు ఎన్టీఆర్‌తో చేసిన సినిమాలతోనే స్టార్‌డమ్‌ రావడం విశేషం. అదే సంవత్సరం కృష్ణ హీరోగా వచ్చిన ‘బుర్రిపాలెం బుల్లోడు’ చిత్రంలో  శ్రీదేవి హీరోయిన్‌గా ఎంపికైంది. వాస్తవానికి ఈ సినిమాలో మొదట జయప్రదను హీరోయిన్‌గా అనుకున్నారు. 5 వేలు అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. తర్వాత ఆ స్థానంలో శ్రీదేవిని తీసుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు రాజుకోవడానికి ఇది కూడా ఒక కారణం అయి వుండొచ్చు. 

ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్యా పోటీ పెరిగింది. సినిమాలతో ఇద్దరూ బిజీ అయిపోయారు. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా మొదట జయప్రదే పరిచయం అయింది. 1979లో వచ్చిన ‘సర్‌గమ్‌’ చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది జయప్రద. శ్రీదేవి కూడా అదే సంవత్సరం ‘సోల్వా సావన్‌’ చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఫ్లాప్‌ అయింది. ఆ తర్వాత నాలుగేళ్ళకు ‘హిమ్మత్‌వాలా’తో శ్రీదేవి హీరోయిన్‌గా బాలీవుడ్‌లో నిలబడిరది. ‘ఊరికి మొనగాడు’ చిత్రానికి ఇది రీమేక్‌. ఈ సినిమాలో శ్రీదేవిని హీరోయిన్‌గా తీసుకోవద్దని డిస్ట్రిబ్యూటర్లు గొడవ చేశారు. తెలుగులో హీరోయిన్‌గా నటించిన జయప్రదనే తీసుకోవాలని అన్నారు. కానీ, దర్శకనిర్మాతలు అవేవీ పట్టించుకోకుండా శ్రీదేవినే హీరోయిన్‌గా ఉంచారు. శ్రీదేవి, జయప్రద మధ్య దూరం పెరగడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఇలా ఇద్దరూ అంచెలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్‌లో, బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్స్‌ అయిపోయారు. 

ఇక ఇద్దరూ కలిసి తెలుగు, హిందీ భాషల్లో ఓ డజను సినిమాలు చేసినా ఇద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడలేదు. తెలుగులో వచ్చిన ‘దేవత’ చిత్రాన్ని చూస్తే అక్కా చెల్లెళ్ళుగా ప్రేక్షకుల్ని ఇద్దరూ ఎంతగా ఆకట్టుకున్నారో అందరికీ తెలిసిందే. నిజజీవితంలో అక్కాచెల్లెళ్ళు కూడా అంత అన్యోన్యంగా ఉండరు అనేంత పేరు తెచ్చుకున్నారిద్దరూ. సినిమాల్లోని క్యారెక్టర్స్‌ చేసేటపుడు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకునే ఇద్దరూ షాట్‌ అవ్వగానే ఎడమొహం పెడమొహంగా ఉండేవారు. నిజం చెప్పాలంటే ఇద్దరూ అంత విరోధులుగా మారడానికి చిన్న చిన్న కారణాలు వున్నాయి తప్ప బలమైన కారణం ఒక్కటి కూడా లేదనే చెప్పాలి. 

ఈ విషయం గురించి జయప్రద ఓ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే.. ‘మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. కానీ, ఇద్దరం మాట్లాడుకోం. నిజం చెప్పాలంటే శ్రీదేవి కొంచెం యారగెంట్‌గా ఉండేది. ఇద్దరం షాట్‌లో పోటాపోటీగా నటించినా.. ఒక్కసారి లైట్స్‌ ఆఫ్‌ అయిపోతే ఆమె కుర్చీ అటు, నా కుర్చీ ఇటు ఉండేది. ఎందుకో మా ఇద్దరి ఫ్రీక్వెన్సీ కలవలేదు. సినిమాలు మాత్రం పోటాపోటీగా చేసేవాళ్ళం. ఆమె గ్లామర్‌ రోల్స్‌ చేస్తే.. నేను యాక్టింగ్‌ ఓరియంటెడ్‌ క్యారెక్టర్స్‌ చేసేదాన్ని. కానీ, ఒక నటిగా ఆ అమ్మాయంటే నాకెంతో గౌరవం. మా ఇద్దరినీ కలపాలని చాలా మంది ట్రై చేశారు. కానీ, కుదరలేదు. హిందీలో ‘మక్సద్‌’ అనే సినిమా ఇద్దరం కలిసి చేశాం. ఆ సినిమా షూటింగ్‌ టైమ్‌లో హీరో జితేంద్ర మమ్మల్ని కలిపేందుకు ట్రై చేశారు. మా ఇద్దరినీ ఒక గదిలో పెట్టి బయట తాళం వేశారు. అలా గంట సేపు మమ్మల్ని ఒకే గదిలో ఉంచారు. కానీ, ఆ గంట సేపు ఇద్దరం మౌనంగా కూర్చున్నాం తప్ప ఏమీ మాట్లాడుకోలేదు’ అని వివరించారు. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.